కానిస్టేబుల్ ఇంట్లో గంజాయి...

కానిస్టేబుల్ ఇంట్లో గంజాయి...

పోలీసు శాఖలో కలకలం..

సికె న్యూస్

మత్తు పదార్థాల అక్రమ రవాణా, విక్రయాలను అదుపు చేసే పోలీసుల వద్దే గంజాయి దొరికింది. కంచే చేను మేసింది అన్నట్లున్న ఈ సంఘటన కమిషనరేట్ పరిధిలో సంచలనం సృష్టించింది.


కాజీపేట పోలీసు డివిజన్ కరీంనగర్ రోడ్డులోని ఠాణాలో పనిచేస్తున్న నర్సంపేటకు చెందిన కానిస్టేబుల్ ఈ దందాకు పాల్పడుతున్నట్లు గుర్తించారు.

మత్తు పదార్థాల నివారణ కోసం కమిషనరేట్ లో ఏర్పాటు చేసిన ప్రత్యేక విభాగం పోలీసులు ఆయన ఇంట్లో గంజాయి ఉన్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.


విశ్వసనీయవర్గాల సమాచారం మేరకు.. సదరు కానిస్టేబుల్ పనిచేస్తున్న ఠాణాలో గతేడాది టాస్క్ఫోర్స్ పోలీసులు భారీగా గంజాయి పట్టుకున్నారు. 

దాన్ని సీజ్ చేసి ఠాణాలో ఉంచారు. నిందితులపై కేసు నమోదు చేశారు. అందులో పనిచేస్తున్న కానిస్టేబుల్ దృష్టి దానిపై పడింది.

 దశలవారీగా దాంట్లో నుంచి మాయం చేస్తూ స్నేహితులు, బంధువుల ద్వారా విద్యార్థులకు విక్రయించడం ప్రారంభించాడు.

నర్సంపేట డివిజన్ పోలీసులు నర్సంపేట నుంచి వరంగల్ కు వచ్చే మార్గంలో వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలో ఇద్దరు వ్యక్తులు ద్విచక్రవాహనంపై అక్కడకు వచ్చారు.

 పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించారు. వెంబడించగా ఇద్దరిలో ఒకరు దొరికారు. ఆయన వద్ద కొంత ఎండు గంజాయి లభించింది.

విచారించగా కానిస్టేబుల్ వద్ద తీసుకొని వచ్చి విక్రయిస్తున్నట్లు చెప్పడంతో విషయం బయటపడింది. కానిస్టేబుల్ ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం.

Comments